సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : సంపూర్ణ అంధత్వ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ అన్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టర్ స్థానిక 43వ డివిజన్ లోని రేవతి సెంటర్ కమ్యూనిటీ హాల్, 37వ డివిజన్ లోని పాత మునిసిపల్ కార్యాలయం, రఘునాథపాలెం మండలం వివి పాలెం, చింతకాని మండలం వందనం ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటుచేసిన కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ తనిఖీ చేశారు. శిబిరంలో ఏర్పాట్లను పరిశీలించారు. నిర్వహిస్తున్న రిజిష్టర్లను పరిశీలించి, నమోదులు జాగ్రత్తగా చేపట్టాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో 55 బృందాలను ఏర్పాటుచేసి, 100 రోజుల్లో ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు చేపట్టేలా కార్యాచరణ చేసినట్లు తెలిపారు. కంటి వెలుగు అనగానే కంటి చూపు పరీక్ష అనే తేలిక భావం ఉంటుందని, కానీ ప్రతి మనిషికి కంటి చూపు ఎంత అవసరం అనే విషయాన్ని గుర్తించాలని ఆయన తెలిపారు. నివారించదగ్గ అంధత్వాన్ని మనం పరీక్షలు చేసుకొని వెంటనే నివారించు కోవాలని ఆయన అన్నారు. శిబిర నిర్వహణ విషయమై ముందస్తుగా విస్తృత ప్రచారం చేయాలని, ప్రజల సమీకరణ చర్యలు పకడ్బందీగా చేయాలని అన్నారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పని చేసి ప్రజలను భాగస్వామ్యం చేయాలని ఆయన తెలిపారు. కలెక్టర్ పర్యటన సందర్భంగా నగర మేయర్ పునుకొల్లు నీరజ, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. మాలతీ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, వైద్యాధికారులు డా. నాగమణి, డా. ప్రేమలత, డా. వెంకటనరసయ్య, డా. సంధ్యారాణి, డా. ఉషారాణి, డా. వెంకటేశ్వర్లు, రఘునాథపాలెం ఎంపిడివో రామకృష్ణ, కార్పొరేటర్ క్లెయిమేట్, వందనం సర్పంచ్ సునీత తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin