సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిన తర్వాత తొలిసారిగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభ జనవరి 18న జరగనుండగా, సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సోమవారం ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ. ఒకప్పటి ఖమ్మంకు ఇప్పటి ఖమ్మంకు పోలికే లేదని అన్నారు. ఖమ్మంలో రూ. 1, 200 కోట్ల అభివృద్ధి జరిగిందని తెలిపారు. తాను ఖమ్మం వచ్చినప్పుడల్లా కొన్ని అంశాలు నేర్చుకుని పోతున్నానని వెల్లడించారు. లకారం చెరువు, డివైడర్, చెట్లు. ఇలా ఖమ్మంలో అనేక ప్రాంతాలను ఫొటోలు తీసుకుని ఇదే తరహాలో తన నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేసుకున్నట్టు హరీశ్ రావు వివరించారు. ఇక రాజకీయాలపై స్పందిస్తూ, ఈసారి కాంగ్రెస్ పని ముగిసినట్టేనని, ఖమ్మంలో బీజేపీకి స్థానం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా బీజేపీలో చేరితే అది ఆత్మహత్య చేసుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరడమంటే తమ గొయ్యి తాము తొవ్వుకోవడమేనని అన్నారు. ఖమ్మంలో బీజేపీ మొలకెత్తదని తేల్చి చెప్పారు. ఖమ్మం పోరాటాల గడ్డని. ఇక్కడ ఎర్ర జెండాలు పాలించాయని అని చెప్పారు. ఇక్కడ మతతత్వ పార్టీలు మనుగడ సాగించలేవని హరీష్ రావు పేర్కొన్నారు. మతతత్వ పార్టీలకు ఇక్కడ ఓట్లు పడతాయా? అని ప్రశ్నించారు. ముచ్చటగా మూడోసారి కూడా తమదే విజయం అని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలో 10 ఎమ్మెల్యే స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉండే ప్రశ్నే లేదని అది రోజు రోజుకు డౌన్ అయిపోతుందని విమర్శించారు. ఖమ్మం ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని తెలిపారు. ఈ జిల్లా ధర్మం వైపు, న్యాయం వైపు నిలబడుతుందని స్పష్టం చేశారు...
-----------------------
Admin