సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గత పది రోజులుగా లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షల ముగింపు సందర్భంగా ఆదివారం ముఖ్యఅతిథిగా పాలమూరు ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి హాజరైనారు. ఈయనతో పాటు కాంగ్రెస్ వీర్లపల్లి శంకర్, సిపిఎం నేత ఎన్ రాజు, వైయస్సార్ తెలంగాణ పార్టీ కోఆర్డినేటర్ మహమ్మద్ ఇబ్రహీం, బహుజన సమాజ్ పార్టీ కన్వీనర్ దొడ్డి శ్రీనివాస్, నవ తెలంగాణ చైతన్య సమితి అధ్యక్షుడు తుప్పుడు నరసయ్య, ప్రజా సంఘాల నేతలు అర్జునప్ప, తిరుమలయ్య, టీజీ శ్రీనివాస్ తదితర రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు హాజరైనారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీర్లపల్లి శంకర్ ప్రసంగించారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణం పేరు చెప్పి రెండు సార్లు అధికారం అనుభవించారని శంకర్ ధ్వజమెత్తారు. అసలు నికరజలాల్లో వాటానే లేదు లక్ష్మీదేవి పల్లి ఎలా నిర్మిస్తారని శంకర్ ప్రశ్నించారు. గాడి తప్పిన పరిపాలనలో లక్ష్మీదేవి పల్లి హామీ మరింత గాడి తప్పిందని అన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే అవాకులు చవాకులు పేలుతున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు లక్ష్మీదేవి పల్లిపై వాస్తవ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సత్యహరిశ్చంద్రులైతే నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారో వెంటనే ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దశాబ్ది ఉత్సవాలు ఎందుకు జరుపుతున్నారో ప్రజలకు సవివరంగా చెప్పాలని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేస్తున్నందుకు దశాబ్ది ఉత్సవాలని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చేసిన వాగ్దానాలు మరిచిపోయి ప్రజలను గత తొమ్మిదేళ్లుగా పీడించకొని తింటున్న పాలకులు అందుకే దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నాయా? అంటూ విమర్శించారు. పాలకుల దోపిడీకి అంతం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీదేవి పల్లి పై ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఉద్యమిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రభుత్వ తాటాకు చప్పుళ్ళకు తాము భయపడమని అవసరమైతే జైల్లోకి వెళ్లడానికి కూడా సిద్ధమేనని ప్రకటించారు. దశాబ్ది ఉత్సవాల్లో మందులు ఏరులై పారుతోందని విమర్శించారు. చేస్తున్న మోసాలను కప్పిపుచ్చుకోవడానికి దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజల ముందుకు వస్తున్నారని, ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉత్సవాలు జరుపుకోవాలని సవాల్ విసిరారు. ప్రభుత్వం చేసిన వాగ్దానాలు నెరవేర్చితే తాము రోడ్లమీదకు ఎందుకు వస్తామని ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు ఎందుకు నెత్తినోరు బాదుకుంటాయని ప్రశ్నించారు. చెప్పినవన్నీ చేసి ఓట్లు అడగాలని వారు పాలిస్తే తమకేమీ అభ్యంతరం లేదని అన్నారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ కట్టకుండా ఈసారి ఎన్నికల్లో ఓట్లు ఎలా అడుగుతారో ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు చూస్తాయని, అధికార పార్టీ భరతం పట్టడం ఖాయమని హెచ్చరించారు. ప్రభుత్వానికి తమ రిలే నిరాహార దీక్షలు సరిపోవని ఇంకా ఉద్దుత రూపంలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వస్తామని శంకర్ స్పష్టం చేశారు. పది రోజులపాటు రిలే నిరాహార దీక్షలకు సహకరించిన ప్రతిపక్ష ప్రజా సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ దశాబ్ది ఉత్సవాలకు నిరసనగానే ఈ పది రోజులపాటు నిరాహార దీక్షలు చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, రఘు, బాదేపల్లి సిద్ధార్థ, అంజమ్మ, శీను నాయక్, చంద్రశేఖర్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin