సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజక వర్గంలో అనేక గిరిజన తండాల్లో వాటర్ ప్లాంట్ సౌకర్యం లేక అపరిశుభ్రమైన నీటిని గిరిజనులు తాగుతున్నారని వారి కోసం పరిశుద్ధమైన జలాన్ని అందించేందుకు పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రీశ్రీశ్రీ సంత్ సేవాలాల్ సుజల కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. శనివారం షాద్ నగర్ పట్టణంలోని శ్రీ సాయి బాలాజీ టౌన్షిప్ లోగల విష్ణువర్ధన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజక వర్గంలోని 250 నుండి సుమారు 300 జనాభా గల తండాల్లో పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 50 వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. దీనికోసం గిరిజన ప్రజలు ఆ తండాలకు సంబంధించిన యువత ఒక కమిటీ ద్వారా రాజకీయాలకు అతీతంగా తండాలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఒక దరఖాస్తు తమకు అందజేయాలని పేర్కొన్నారు. వారి దరఖాస్తులు పరిశీలించి రూ. 3.5 లక్షలతో ఒక సొంత గదితో పాటు ప్లాంట్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దీనికోసం స్థలం తండావాసులు స్థలం చూపాలని మిగతా కార్యక్రమాలు ట్రస్టు చూసుకుంటుందని అన్నారు. వాటర్ ప్లాంట్ నిర్వహణ కోసం బిందెకు ఒక రూపాయి నిర్వహణ ఖర్చు నామ మాత్రంగా పెట్టి ఆ డబ్బుతో గిరిజన తండాలోని ఎవరికైనా నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పి ఆ డబ్బు వారే తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఒక సంవత్సరం పాటు వాటర్ ప్లాంట్ నిర్వహణను పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ స్వయంగా చూసుకుంటుందని అన్నారు. ప్రభుత్వం గానీ ఇతర ఏజెన్సీ సంస్థలు గాని గ్రామ సర్పంచ్ గాని ప్లాంట్ నిర్వహణ చేపడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారికే ప్లాంట్ అప్పచెప్తామని అన్నారు. వాటర్ ప్లాంట్ కార్యక్రమాలను నియోజక వర్గంలోని దొంతికుంట తండా, పుల్చర్ల కుంట తండా, కడియాల కుంట తండాలలో లాంచనంగా ప్రారంభిస్తామని అన్నారు. పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు 28 సేవలు చేపట్టినట్టు చెప్పారు. ఇటీవల గత 45 రోజుల్లో రాఖి చీరల పంపిణీ, హెల్మెట్ పంపిణీ, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి వినూత్న కార్యక్రమాలను ప్రజల కొసం చేపట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో ప్రజలు విజయవంతం చేశారని మీడియా సహకారం మరువలేనిదని అన్నారు. ఇదివరకే 20వేల హెల్మెట్లు పంపిణీ చేశామని చెప్పారు. 9100 డ్రైవింగ్ లైసెన్సులు ఇచ్చామని, ఇంకా 5200 డ్రైవింగ్ లైసెన్సులు డిమాండ్ ఉందని వాటిని కూడా త్వరలోనే అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అమడపురం నర్సింహా, నర్సింహా యాదవ్, ఇస్నాతీ శ్రీనివాస్, సుధాకరప్ప, మోహన్ సింగ్, లష్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin