సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఉచిత కరెంట్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తప్పుబట్టింది. ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ ఆలోచన చేస్తుందని రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ షాద్ నగర్ ఈట గణేష్ ఆరోపించారు. నందిగామలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గణేష్ తదితరులు మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయనీ, విద్యుత్ మూడు గంటలు చాలన్న రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చిందనీ ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రైతన్నకి 24 గంటలు ఉచిత విద్యుత్ వద్దు అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని రైతులపై కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదని విమర్శించారు. ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహనానికి తమ అధినేత కేటీఆర్ పిలుపునిచ్చారనీ ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని రద్దు చేయాలనే దుర్మార్గపు ఆలోచన కాంగ్రెస్ పార్టీదన్నారు. గతంలో కూడా విద్యుత్ ఇవ్వకుండా రైతులను గోసపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని విమర్శించారు. మరోసారి రైతు వ్యతిరేక విధానాలను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టుకుందన్నారు. దీన్ని తెలంగాణ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ విట్టల్ సీనియర్ నాయకుడు కే కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin