సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మఖ్తల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థలం కేటాయించడంతోపాటు భవన నిర్మాణానికి అవసరమైన నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని టీయూడబ్లూజే హెచ్ 143 యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మామిళ్ల పృథ్వీరాజ్ , మఖ్తల్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం సమావేశంలో మాట్లాడుతూ, నియోజకవర్గ కేంద్రమైన మఖ్తల్ లో ప్రెస్ క్లబ్ భవనం కోసం గత కొన్నేళ్ల నుంచి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు డిమాండ్ చేస్తున్నారని, ఇప్పటివరకు మఖ్తల్ లో ప్రెస్ క్లబ్ భవనం లేకపోవడం శోచనీయమన్నారు. గత రెండు మూడు రోజుల కిందట షాద్ నగర్ నియోజకవర్గంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణాల కోసం 2 కోట్ల 30 లక్షల నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు. షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం 50 లక్షలు, అదే నియోజకవర్గంలోని ఆరు మండల కేంద్రాల్లో ప్రెస్ క్లబ్ భవనాల నిర్మాణం కోసం తలా 30 లక్షలు కలిపి మొత్తం 2 కోట్ల 30 లక్షల నిధులు మంజూరు చేశారని అన్నారు. మఖ్తల్ నియోజకవర్గ కేంద్రమైన మఖ్తల్ పట్టణంలో ప్రెస్ క్లబ్ భవనం కోసం స్థలంతోపాటు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్తుల పాత్ర ఎనలేనిదని, 2014కు ముందు ఎన్నికల్లో ఉద్యమనేత కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. సమావేశంలో జర్నలిస్ట్ కార్తీక్ పాల్గొన్నారు.
-----------------------
Admin