సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : భారత రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీల రహస్య ఒప్పందం ఎన్నో సందర్భాల్లో తేటతెల్లం అయ్యిందని ఈ రెండు పార్టీలను ప్రజలు నమ్ముకుంటే అధోగతి పాలేనని మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజక వర్గం పరిశీలకులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత కుమారస్వామి మంగళం స్పష్టం చేశారు. బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో స్థానిక క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అంతకన్నా ముందు ఆయన నియోజకవర్గ ఓటర్ల జాబితా పై నాయకులతో కీలక అంశాలు చర్చించారు. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బోగస్ ఓట్ల జాబితాలు ఉన్నాయని ఈ ఓట్లను కాంగ్రెస్ పార్టీ సున్నిక్షితంగా పరిశీలించాలని సూచించారు. ఓటర్ జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక సమాచారం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వీటిని పరిశీలించి కీలక విషయాలు సూచనలు జారీ చేసినట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని బహుమానంగా ఇచ్చిన సోనియా గాంధీ తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెలకొల్పేందుకు పక్క ప్రణాళికలు సిద్ధం చేశామని వివరించారు. ఐదు ముఖ్యమైన గ్యారెంటీ కార్డులను కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ సమావేశాల తర్వాత భారీ బహిరంగ సభలో వెల్లడిస్తారని చెప్పారు. హైదరాబాద్ లో త్వరలో జరగనున్న సిడబ్ల్యుసి సమావేశాలు భారీ బహిరంగ సభ కార్యక్రమాలతో ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలను ప్రకటిస్తామని అన్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సర్వేల ఆధారంగా వీర్లపల్లి శంకర్ గెలుపుకు మంచి సంకేతాలు ఉన్నాయని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రజలవి బానిస బతుకులు అయ్యాయని వీర్లపల్లి శంకర్ అన్నారు. మీడియా సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్ బోగస్ లిస్టులు తయారు చేస్తున్నారని ఎన్నో అవకతవలు చోటు చేసుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. చనిపోయిన వారి పేర్లు జాబితా నుండి ఇంకా తొలగించలేదని అన్నారు. ఇప్పటికే 3 వేల ఓట్లకు పైగా బోగస్ ఓట్లు గుర్తించినట్టు చెప్పారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన చేపట్టిందని అన్నారు. దౌర్జన్యం అవినీతి అక్రమాలు పెచ్చుమిరిపోయాయని శంకర్ అన్నారు. కుటుంబ పాలన కూడా ఇక్కడే ఉందని నియంతృత్వ పోకడలతో ప్రజలను పరిపాలిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. బానిసలు అంటే విన్నామని కానీ ఇప్పుడు తెలంగాణలో ప్రజల బతుకులు చూస్తుంటే కనిపిస్తుందని అన్నారు. సిడబ్ల్యూసి సమావేశాలకు హైదరాబాద్ వేదిక అవుతుందని ఐదు గ్యారెంటీ సంక్షేమ పథకాలు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సోనియాగాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గేలాంటి హేమాహేమీలు రాబోతున్నారని హైదరాబాద్ సమావేశాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త కళ వస్తుందని అన్నారు. కనివిని ఎరగని రీతిలో జరగబోతున్న కాంగ్రెస్ సమావేశాలు, మహాసభ నభూతో నా భవిష్యత్తుగా మారుతాయని అన్నారు. ఈ దొంగల, దోపిడీ ప్రభుత్వాన్ని గద్దె దించి తరిమికొడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం విజయభేరి సభ పోస్టర్లను లాంఛనంగా విడుదల చేశారు. నియోజకవర్గంలోని 15 వేల మంది కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున విజయభేరి సభకు తరలి వెళ్తారని వీర్లపల్లి శంకర్ ప్రకటించారు.
-----------------------
Admin