సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : గ్రూప్-2 పరీక్షలను తక్షణమే వాయిదా వేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ డిమాండ్ చేశారు.శనివారం పార్టీ శ్రేణులతో కలిసి బస్టాండ్ తెలంగాణ స్థూపం వద్ద గ్రూపు-2 పరీక్షలను వాయిదా వేయాలన్న డిమాండ్ తో ప్లకార్డులతో నిరసన తెలిపారు.ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 5 లక్షల మంది గ్రూపు-2 అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా పరీక్షలు వాయిదా వేయాలని,ఒక్క ఆగస్టు నెలలోనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే 21 పరీక్షలు జరుగుతున్నాయని వాటిలో గురుకుల ఉపాధ్యాయులు,పాలిటెక్నిక్,జూనియర్ లెక్చరర్ పరీక్షలు కూడా ఉన్నాయని తెలిపారు.ఇతర పరీక్షలు రాసే అభ్యర్థులు గ్రూపు-2కు సైతం హాజరవుతున్నారని,వేర్వేరు సిలబస్ కలిగిన అభ్యర్థులకు తగిన వ్యవధి ఇవ్వకపోవడం అన్యాయమని పేర్కొన్నారు.గత పదేళ్ళుగా నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇప్పుడు ఇంత హడావుడిగా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.అభ్యర్థుల ఇబ్బందులను పట్టించుకోకుండా టీఎస్ ఫిఎస్సీ మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు.అన్ని పూర్తయిన తర్వాతే గ్రూపు-2 పరీక్ష నిర్వహించాలన్నారు.నిరుద్యోగులకు న్యాయం జరిగేలా చూడాలని నేడు గన్ పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్న రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.యస్.ప్రవీణ్ కుమార్ గారిని ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.ఎన్ని నిర్బంధలు విధించిన గ్రూపు-2 అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి,జిల్లా కార్యదర్శులు మాలోత్ వీరు నాయక్,చెనిగారపు నిరంజన్ కుమార్,అల్లకొండ శరత్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin