సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : షాద్ నగర్ మున్సిపాలిటీలో టెండర్లు వేసి పనులు పూర్తిచేసినా సదరు బిల్లులకు చెక్కులు అందజేసి ఆ తర్వాత సంవత్సరం గడిచినా ఇంకా బిల్లులు పాస్ కాలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పట్టణ మాజీ ఉపసర్పంచ్ మహ్మద్ అలీ ఖాన్ బాబర్ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పట్టణ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో కాంట్రాక్టర్లకు జరుగుతున్న అన్యాయం, బిల్లుల అలసత్వంపై వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో టెండర్ల ద్వారా పనులు దక్కించుకొని వాటిని పూర్తి చేసిన తర్వాత చెక్కులు ఇస్తున్నారని కానీ సంవత్సరం గడిచిన ఆ చెక్కులు పాస్ కావడంలేదని అన్నారు. కాంట్రాక్టర్లను మానసికంగా వేధిస్తున్నారని కాంట్రాక్టర్లకు తమకు రావాల్సిన డబ్బుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. టెండర్లు దక్కించుకున్నాక పనులు చేయమని అధికారులు ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తారని తీరా పనులు చేశాక బిల్లులు చెల్లించడంలో ఎందుకు ఆలస్యం జరుగుతుందని ప్రశ్నించారు. గతంలో అనేక పర్యాయాలు సంబంధిత అధికారులకు ప్రజాప్రతినిధులకు ఈ సమస్యను తెలియజేయడం జరిగిందని అన్నారు. అయినప్పటికీ చెక్కులు చెల్లింపు విషయంలో తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టర్ల గురించి ఎవరికి పట్టడం లేదని దీనిపైన ఉన్నతాధికారులు వీలైనంత త్వరగా చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించడం లేదని చాలామంది పనులు చేయడం మానేశారని పేర్కొన్నారు. టెండర్లు రెండు పర్యాయాలు పెట్టినా వాటినీ చేయుటకు కాంట్రాక్టర్లు ముందుకు రాక ప్రజాప్రతినిధులు బయటి కాంట్రాక్టర్లను తెచ్చి టెండర్లు చేయుటకు ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తమకు రాని నిధులు బయట వారికి ఎలా చెల్లిస్తారని ఈ సందర్భంగా వినతిపత్రంలో ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులను వీలైనంత త్వరగా చెల్లింపులు చేయాలని లేనియెడల సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఈ వినతి పత్రాన్ని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆర్థిక శాఖ మంత్రికి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, మీడియాకు సదరు పత్రాన్ని పంపినట్టు చెప్పారు.
-----------------------
Admin