సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 9వ తేదీ నుంచి ఆయన తెలంగాణ మొత్తం చుట్టేలా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ కూడా అనుమతి ఇచ్చిందని తెలుస్తోంది. ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు కానీ.. కాంగ్రెస్ పార్టీలోని రేవంత్ వర్గీయులు ఇప్పటికే పాదయాత్ర ఏర్పాట్లు, రూట్ మ్యాప్ వంటి అంశాలపై కసరత్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఖచ్చితంగా ఏడాది మాత్రమే సమయం ఉంది. ఆరు నెలల్లో తెలంగాణ మొత్తం పాదయాత్ర పూర్తి చేసి ఆ తర్వాత .. ఎన్నికల సన్నాహాలను ముందుండి చేయాలని రేవంత్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది... తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వచ్చింది. దాదాపుగా రెండు వారాల పాటు సాగిన పాదయాత్రలో మంచి జోష్ వచ్చిందని.. రాహుల్ గాంధీపై చాలా పాజిటివ్ అభిప్రాయం ఏర్పడిందని.. దాన్ని ఓట్ల రూపంలో మార్చుకునేందుకు తెలంగాణ నేతలు పని చేయాల్సి ఉంటుందని ఓ అంచనాకు వచ్చారు. ఈ ప్రకారం రేవంత్ రెడ్డి తన పాదయాత్ర ప్రణాళికల్ని రాహుల్ ముందు ఉంచినట్లుగా చెబుతున్నారు. పాదయాత్రతో పాటు మునుగోడు ఉపఎన్నికలనూ ఒంటి చేత్తో రేవంత్ రెడ్డి సమన్వయం చేశారు. రేవంత్ పనితీరు రాహుల్ గాంధీకి బాగా నచ్చడంతో పాదయాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలనే ఆలోచన ఎప్పట్నుంచో చేస్తున్నారు. పీసీసీ చీఫ్ పదవి దక్కిన తర్వాత మొదట అదే పని చేద్దామనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత రాజకీయాల వల్ల సాధ్యం కాలేదు. ఓ సారి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వరకూ చేసిన పాదయాత్రపై అనేక ఫిర్యాదు హైకమాండ్కు వెళ్లాయి. అదే సమయంలో స్టార్ క్యాంపెయినర్గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాను కూడా పాదయాత్ర చేస్తానని హైకమాండ్ ముందు ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు ఆయన పార్టీలో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు ఆయన పై పార్టీ హైకమాండ్ కూడా నమ్మకం కోల్పోయింది. దీంతో రేవంత్కు లైన్ క్లియర్ అయినట్లంది.
-----------------------
Admin