సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ అధికార పార్టీ బీఆర్ఎస్ నాయకులు ప్రతిపక్షాలపై కారు కూతలు కట్టిపెట్టి అభివృద్ధికి తోడ్పడాలని, ప్రజా సమస్యలపై పాలకులకు సునిషిత దృష్టి కరువైందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ విమర్శించారు. బుధవారం షాద్ నగర్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వీర్లపల్లి శంకర్ తదితరులు మాట్లాడారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా నిలదీస్తూనే ఉంటుందని అన్నారు. పనులు చేపట్టే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టును తామే అడ్డుకున్నట్టుగా ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపుతున్నారని అన్నారు. ఎమ్మెల్యే అంజయ్యకు నిజాయితీ ఉంటే ప్రాజెక్టు కట్టి చూపించాలని తాము కూడా అదే కోరుకుంటున్నామని అన్నారు. అదేవిధంగా పట్టణంలో చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం విషయంలో నిధులు కేటాయించామని గొప్పలు చెప్పుకొని పత్రికల్లో ప్రకటనలు గుప్పించి ఆదరణ పొందారని మరి పనులు ఎందుకు చేపట్టడం లేదని? ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో త్వరలోనే బయటపెడతామని అన్నారు. ఎవరో ఒకరిద్దరి కోసం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ఆగుతున్నాయన్న సమాచారం తమకు ఉందని అన్నారు. ప్రజలకు నష్టపరిహారం ఇచ్చి అభివృద్ధి పనులను చేపట్టాలని ప్రజలను సాకుగా చూపి వారు అడ్డుపడుతున్నారని నెపం వారిపై వేసి తాము ఆ ముసుగులో తప్పించుకుంటే సరిపోదని, ప్రజల ముందు పాలకుల ముసుగు తొలగిస్తామని శంకర్ హెచ్చరించారు. ఇక పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో ఎమ్మెల్యే కనుసనలలో జాబితా సిద్ధం అయిందని ఆరోపించారు. దమ్ముంటే జాబితాను అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో విడుదల చేయాలని, ప్రజాసంఘాల సమక్షంలో ఎవరెవరికి మంజూరు చేశారో ప్రకటించాలని సవాల్ విసిరారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎంతోమంది నిరుపేదలు ఎదురుచూస్తున్నారని ఇందులో అవినీతి అక్రమాలు జరిగినట్టు ఎంతో మంది నిరుపేదలు చెబుతున్నారని, తలుపులు వేసుకొని అధికారులు లక్కీ డ్రా తీస్తుంటే నిష్పక్షపాతంగా ఎంపికలు జరగకపోతే ఆ బాధ్యత ఎవరు వహించాలని అన్నారు. తాము వాస్తవాలను ప్రశ్నిస్తే టిఆర్ఎస్ నాయకులు కారుకూతలు కూస్తున్నారని అనమాకులను తీసుకొచ్చి వారితో ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. గుడిసెల్లో జీవనం సాగిస్తున్న వారు ఇంట్లో పాచి పనులు చేసుకుంటున్నారు దేవర సంచార జాతుల వారు నిలువు నీడ లేక ఎండకు ఎండి వానకు తడుస్తున్నారని అలాంటి వారికి కాకుండా అధికార పార్టీ అనుయాయులకే ఇల్లు దక్కుతున్నాయని శంకర్ విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులు నిజాయితీ ఉంటే వెంటనే అఖిలపక్షంలో జాబితా విడుదల చేసి గ్రామసభ ఏర్పాటు చేసి వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 80% ఇండ్లు అధికార పార్టీ మద్దతుదారులకే మంజూరు చేసినట్టు తమకు సమాచారం ఉందని, నిజాయితీ ఉంటే ఇది నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఏవో కుంటి సాకులు చెప్పి ప్రజలను మభ్యపెడితే సరిపోదని అన్నారు. అదేవిధంగా షాద్ నగర్ చౌరస్తా నుండి అన్నారం జంక్షన్ వరకు రోడ్డు పనులు ఎందుకు చేపట్టడం లేదని ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలియదా? అని ప్రశ్నించారు. ఒకవైపు చటాన్ పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం లేక ఇక్కడ అన్నారం వైపు పాత జాతీయ రహదారి పనులు చేపట్టాక ప్రజలు నరకయాతన అనుభవిస్తున్న తీరు పాలకులకు కనిపించడం లేదా అని శంకర్ ప్రశ్నించారు. గ్రామాల్లో కూడా బోగస్ అభివృద్ధి పనుల ఉత్తర్వులు చూపించి కాంగ్రెస్ కార్యకర్తలను అధికార పార్టీలో కలుపుకునేందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. ఏదైనా తమ మంచికే అని అతిగా ఆశపడే వారికి ఏం జరుగుతుందో తమకు తెలుసని అన్నారు. రేపటి జడ్చర్ల మహాసభకు తరలిరండి..... కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపడుతున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా 850 కిలోమీటర్ల యాత్ర పూర్తయిందని రెండవ మహాసభను జడ్చర్లలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు వీర్లపల్లి శంకర్ వెల్లడించారు. మండలానికి వెయ్యి మందికి తగ్గకుండా కార్యకర్తలు సభకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను అడుగడుగున ఎండగడుతూ సాగుతున్న పాదయాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమానికి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ బాలరాజ్ గౌడ్ సుదర్శన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin