సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని 16చింతల్ తాండలో చోటుచేసుకున్న దారుణ ద్విహత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.భార్యాభర్తలను అత్యంత క్రూరంగా హత్య చేసి, ఇద్దరిని తీవ్రంగా గాయపరిచిన కేసులో నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ వరంగల్ I అదనపు జిల్లా న్యాయమూర్తి జె. మైత్రేయి కఠిన తీర్పు ప్రకటించారు. బి.ఎన్.ఎస్ సెక్షన్లు 333, 103(1), 109, 351(3) మరియు ఆమ్స్ యాక్ట్ సెక్షన్ 25(1 ఏ) కింద నమోదైన ఈ కేసులో నిందితుడు మేకల నాగరాజు అలియాస్ బన్నీ దోషిగా తేలాడు. బి ఎన్ ఎస్ సెక్షన్ 103(1) కింద నేరం రుజువుకాగా, బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ 238(2) ప్రకారం “మెడకు ఉరి వేసి మరణించే వరకు” ఉరిశిక్ష అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. అదనంగా రూ.5 వేల జరిమానా కూడా విధించింది.ఈ ఘటనలో బానోత్ సుగుణ (45), ఆమె భర్త బానోత్ శ్రీను (50) ప్రాణాలు కోల్పోగా, బానోత్ దీపిక (21), బానోత్ మదన్ లాల్ (17) తీవ్ర గాయాలతో బయటపడ్డారు.బాధితులంతా (ఎస్టి)లంబాడి వర్గానికి చెందిన వారు.ఈ దారుణ ఘటనపై బానోత్ ఈరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.గూడూరు మండలం గుండెంగా గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేకల నాగరాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.ఈ కేసులో మొదట చంద్ర మోహన్, సిఐ ఆఫ్ పోలీస్, ఎస్ బి వరంగల్ దర్యాప్తు చేపట్టగా, అనంతరం శ్రీనివాస్ సిఐ నెక్కొండ సర్కిల్ విచారణ కొనసాగించారు. ప్రస్తుతం చెన్నారావుపేట ఎస్సై గా రాజేష్ రెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు.ప్రత్యేక అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బృందా దేవి సమర్థవంతమైన వాదనలు వినిపించడంతో కేసులో నిందితుడికి కఠిన శిక్ష పడినట్లు న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి.
-----------------------
Reporter