సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : లక్షలాది మంది భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మేడారం వన దేవతల జన ప్రవేశం పూర్తయింది. కన్నెపల్లి నుండి సారలమ్మ, చిలుకలగుట్ట నుండి సమ్మక్క దేవతలు ఇద్దరూ గద్దెలపై ప్రతిష్టాపన చేయడంతో భక్త జనకోటికి దర్శనమిస్తున్నారు. మహిమాన్వితురాలైన సమ్మక్క తల్లి రాకతో మేడారం ప్రాంగణం పులకించిపోయింది. శక్తి పీఠంగా మారిన మేడారం గద్దెల ప్రాంగణానికి భక్తకోటి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు... భక్తిభావం ఎదురు చూసిన అద్భుత దృశ్యం మేడారంలో ఆవిష్కృతమైంది. మేడారం మూలదేవత సమ్మక్క గద్దెలపైకి చేరారు. పూజారులు చిలకలగుట్ట నుంచి అమ్మవారిని కుంకుమ భరణి రూపంలో గద్దెలపైకి చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, కలెక్టర్ దివాకర ఘనంగా స్వాగతం పలికారు. సమ్మక్క తల్లికి ఆగమనానికి గౌరవ సూచికంగా జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ గాలిలోకి కాల్పులు జరిపి అమ్మవారికి ప్రభుత్వ లాంఛనాలతో స్వాగతం పలికారు. మహా జాతరలో తొలిరోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు చేరుకోగా.. రెండవ రోజు గురువారం ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. సమ్మక్క గద్దెలపైకి చేరుకున్నారు. గురువారం ఉదయం నుండి ప్రత్యేకపూజలు చేసి, వడ్డెలు, సమ్మక్క ఆగమనం కోసం మొదట సమ్మక్క గద్దెపై వన ప్రతిష్ట చేశారు. ఆ తర్వాత చిలుకల గుట్టకు వెళ్ళి రహస్య పూజలు నిర్వహించారు. సాయంత్రం 6:43 నిమిషాలకు కుంకుమ భరణి రూపంలోని సమ్మక్కను పూజారులు చిలుకలగుట్ట నుండి కిందకు తీసుకువచ్చారు. సమ్మక్క ఆగమన మహాఘట్టం మొదలు కావడంతో ఎస్పీ రామ్నాథ్ కేకన్ AK-47 గన్తో గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పించారు.
-----------------------
Admin