సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు తన ప్రేమ వ్యవహారమై యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డ సంఘటన సంచలనం రేకెత్తించింది. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారిస్తున్నారు. యువతిని హతమార్చాలనే కుట్రతో ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పుల్కిచర్ల తాండకు చెందిన తిరుపతి అనే యువకుడు ఈ అఘాయిత్యానికి ఒడి గట్టినట్టు పోలీసులు గుర్తించారు. అతన్ని పట్టుకునేందుకు పట్టణ సీఐ ప్రతాప్ లింగం ఆధ్వర్యంలో 4 పోలీస్ బృందాలతో వేట మొదలుపెట్టారు. పట్టణానికి చెందిన 20 ఏళ్ల యువతి, తిరుపతి ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు అయితే తిరుపతి మరో అమ్మాయితో చనువుగా కూడా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ప్రేమ వ్యవహారంలో తిరుపతి ప్రవర్తన నచ్చక సదరు యువతీ తల్లిదండ్రులు బాధితురాలికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే పలు సందర్భాల్లో తిరుపతి యువతీ పట్ల పలు అనుమానాలు ఇతర విషయాల్లో వేధిస్తున్నట్టు తెలుస్తోంది. మరో యువకుడితో పెళ్లి చేసుకుంటుందని అనుమానం ఇతర కారణాల చేత ఆ యువతిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. శనివారం ఉదయం ఇంటిపై బట్టలు ఆరేసేందుకు వచ్చిన సదరు యువతీని కాపుగాసి తిరుపతి కత్తితో దాడి చేయగా మెడపై, రెండు చేతులపై రక్త గాయాలు అయ్యాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు గట్టిగా అరవడంతో తిరుపతి అక్కడి నుండి పారిపోయాడు. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ప్రతాప్ లింగం తెలిపారు. నిందితుడు తిరుపతిని సాధ్యమైనంత తొందరగా పట్టుకుంటామని చెప్పారు. దీనికోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
-----------------------
Admin