సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : వెనుకబడిన వర్గాల కుల, చేతివృత్తిదారులకు ప్రభుత్వం రూ.లక్ష ఆర్థికసాయం అందించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మంగళవారం (6వ తేదీ) నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనున్నది. ఈ నెల 9న మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా లబ్ధిదారులకు సాయం అందించడంతోపాటు అదేరోజు అన్ని నియోజకవర్గాల్లో గౌరవ మంత్రులు, ఎమ్మెల్యేలతో పథకాన్ని ప్రారంభించనున్నారు. రూ.లక్ష ఆర్థిక సాయం అందించేందుకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కోసం రూపొందించిన https://tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం ప్రారంభించారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను కూడా ఆరంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ, బీసీ కులవృత్తులు నిర్వహించుకొనే చేతివృత్తిదారులకు రూ. లక్ష ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వం అండగా నిలువనున్నదని చెప్పారు. ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
-----------------------
Admin