సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం కలెక్టరేట్ : అవినీతికి అడ్డాగా మారిన టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలని,గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మళ్లీ రద్దు కావడంతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని,కావున వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగా పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి,ముఖ్యమంత్రి కల్వకుంట్ల కుటుంబం కలిసి మార్కెట్లో చేపలను అమ్మినట్లు టీఎస్పీఎస్సీ లో జరిగే పరీక్షల ప్రతీ ప్రశ్నాపత్రాలు అమ్ముతున్నారని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వం మీద,టీఎస్పీఎస్సీ బోర్డుమీద నిరుద్యోగులకు నమ్మకం పోయిందన్నారు.ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు కష్టనష్టాలకోర్చి డబ్బులు పంపిస్తుంటే నిరుద్యోగులు ఏండ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని కానీ కెసీఆర్ నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.పేపర్ లీకేజీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని,పరీక్షకు హాజరైన వారి కన్నా 270 ఆన్సర్ షీట్లు ఎక్కువ ఎందుకు ఉన్నాయో ప్రభుత్వం జవాబు చెప్పాలన్నారు దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ ను తక్షణమే భర్తరఫ్ చేయాలని,బోర్డును పూర్తిగా రద్దు చేసి కొత్త కమిటీని ఎన్నుకున్న తర్వాతే టీఎస్పీఎస్సీలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.పేపర్ లీకేజీల సూత్రధారులు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఉన్నారని ఆరోపించారు.రానున్న ఎన్నికల్లో టీఎస్పీఎస్సీ తీరువల్ల నష్టపోయిన అభ్యర్థులు వారి వారి గ్రామాల్లో తిరిగి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయేలా ప్రచారం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కేసుపాక వెంకటరమణ,జిల్లా ప్రధాన కార్యదర్శి గాడిద దామోదర్,జిల్లా సలహాదారు గంధం మల్లికార్జునరావు జిల్లా మహిళా కన్వీనర్ బండి రమణి,జిల్లా కార్యదర్శి తంబర్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin