సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగివుండాలని, అంతే బాధ్యతగా ఓటు వేయాలని వంద శాతం పోలింగ్ కు అందరూ సహకరించాలని అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో ఎన్నికల నిర్వహణకు సంబంధించి (Systematic Voters' Education and Electoral Participation) స్వీప్ ప్రచార కార్యక్రమాలలో భాగంగా సీనియర్ సిటిజెన్స్, (పి డబ్ల్యూ డి) దివ్యాంగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు ఓటుహక్కు పై అవగాహన, ఓటరు చైతన్య కార్యక్రమాలకు సంబంధించి స్వీప్ ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయని అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. ఓటు హక్కు వినియోగంపై అవగాహణకు నియోజక వర్గాలకలో 5 కే రన్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. సోమవారం ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించామని అక్టోబర్ వరకు 18 సంవత్సరాలు నిండే వారు నూతన ఓటరుగా నమోదు కావాలని చెప్పారు. ఓటు నమోదు కోసం ఫారం 6, ఓటరు చిరునామా, పోలింగ్ కేంద్రాల మార్పుల కోసం ఫారమ్ 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. వచ్చే అక్టోబరు ఒకటవ తేదీ నాటికి 18 సంవత్సరములు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని, ఓటు హక్కు ప్రతి ఒక్కరి ప్ర్రాథమిక హక్కు అని, ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పారు. ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరి బాధ్యత అని, నూరు శాతం పోలింగ్ కు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు. వయోవృద్దులకు, దివ్యాంగులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. పోలింగ్ స్టేషన్ కు రాలేని 80 సంవత్సరములు నిండిన వారికి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రత్యేక చర్యలు కల్పించనున్నట్లు తెలిపారు. గతంలో జిల్లాలో జరిగిన పోలింగ్ నమోదును పరిశీలించి నూరు శాతం జరిగే విధంగా ముమ్మరంగా స్వీప్ ప్రచార కార్యక్రమాల ద్వారా అందరితో మమేకం కావడం జరుగుతుందని తెలిపారు. మీ కుటుంబ సభ్యులను, యువతతో పాటు బంధు మిత్రులు ఓటింగులో పాల్గొనేలా సీనియర్ సిటిజెన్స్ ప్రోత్సహించాలని చెప్పారు. ఓటింగ్ వంద శాతం అయ్యేలా చూడాలని, తమ కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి వుండి ఓటు వేసేలా చూడాలని, అందరం సమన్వయంతో పోలింగ్ శాతం పెంచే విధంగా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. స్వీప్ కన్వీనర్ డిఆర్డీఓ మధుసూదన్ రాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిర్వహణ, పౌరుల బాధ్యతలు, ఓటు విలువ, ఓటు ఆవశ్యకత గురించి వివరించారు. ప్రజలకు సేవ చేసే వారిని ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవడం కోసం ప్రజాస్వామ్య బద్దంగా పౌరునికి సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్చగా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని చెప్పారు. ప్రజలకు సేవలందించే సేవాతత్పరులనే ఎన్నుకోవాలని, వచ్చే అక్టోబరు 19 వరకు ఉన్న ఓటరు సవరణ కార్యక్రమాల ద్వారా ఓటు హక్కులు పొందాలని అన్నారు. కార్యక్రమం అనంతరం సీనియర్ సిటిజన్స్ ను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సభిత, కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin