సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లాలో 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో బిజేపి అధిష్టానం గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చిందని మెజార్టీ స్థానాలు తమ పార్టీ కైవసం చేసుకుంటుందని బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి స్పష్ట చేశారు. సోమవారం ఏబి మినీ కన్వెన్షన్ హాల్లో షాద్ నగర్ అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ విజయకుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీ వర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు దేపల్లి అశోక్ గౌడ్, కమ్మరి భూపాలాచారి, కక్కునూరు వెంకటేష్ గుప్తా, అమడపురం నరసింహ గౌడ్, కురుమయ్య, మఠం రిషికేష్, డాక్టర్ ప్రణీత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. బిజెపి సిద్ధాంతాల పార్టీ అని కష్టం వచ్చిన నష్టం వచ్చిన పార్టీ దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. బిజెపి పార్టీలో ప్రతి అసెంబ్లీ నుంచి టికెట్ ఆశించేవారు పదుల సంఖ్యలో ఉన్నారని చెప్పారు. అయితే ఎవరికో ఒకరికి అధిష్టానం గెలిచేవారికి టికెట్ ఇస్తుందని అన్నారు. తాను కూడా గత 25 సంవత్సరాలుగా పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డట్టు తెలిపారు. అయినా పార్టీ వెన్నంటే ఉన్నానని తెలిపారు. పార్టీని వదిలిపెట్టి ఎక్కడ వెళ్లిపోలేదని అన్నారు. షాద్ నగర్ ఎన్నికల ప్రచారానికి ప్రముఖుల రాక. షాద్ నగర్ అసెంబ్లీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారానికి అందే బాబయ్య మద్దతు కోసం పార్టీ అధిష్టానం ప్రముఖులను రప్పించే ఆస్కారం ఉందని మీడియా అడిగిన ప్రశ్నలకు బొక్క నర్సింహారెడ్డి సమాధానం చెప్పారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్య యోగి వీరిలో ఎవరైనా ఒకరు ప్రచారానికి వస్తారని నరసింహారెడ్డి సూచనప్రాయంగా తెలిపారు. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డికి మద్దతు తెలిపిన వారి సస్పెన్షన్. షాద్ నగర్ అసెంబ్లీలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై సస్పెన్షన్ విధిస్తున్నట్టు బొక్క నర్సింహారెడ్డి మీడియా సమావేశంలో చెప్పారు. కేశంపేట మండల పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, నందిగామ మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ అప్ప, కొత్తూరు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇస్నాతీ శ్రీనివాస్, సీనియర్ యువ నాయకుడు ఆకుల ప్రదీప్ తదితరులను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరి కొంతమంది విషయంలో సస్పెన్షన్ విషయంలో అధిష్టానంతో చర్చలు జరుగుతున్నాయని వారిని కూడా త్వరలోనే వేటు వేస్తామని చెప్పారు. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీకి ఇంకా రాజీనామా చేయలేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మనసు మార్చుకుని పార్టీలోకి వస్తే మంచిదని ఒక అవకాశం ఇచ్చారు. అతన్ని కూడా సంప్రదించకుండా టికెట్ కేటాయించడం తమ పార్టీ కొంత తప్పిదం చేసిన విషయం వాస్తవమేనని ఈ సందర్భంగా ఒప్పుకున్నారు. విష్ణువర్ధన్ రెడ్డికి భవిష్యత్తు ఉంటుందని ఈ పార్టీలో చేరి అందే బాబయ్య విజయానికి దోహదపడాలని ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం. బిజెపి అభ్యర్థి అందె బాబయ్య ప్రచార రథ విషయంలో కొందరు దాడికి పాల్పడ్డారని ఇది సమంజసం కాదని ఇలాంటివి బిజెపి సహించబోదని హెచ్చరించారు. ప్రధాని మోడీ రాక. రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగనున్న బిజెపి భారీ బహిరంగ సభకు ప్రధానమంత్రి మోడీ వస్తున్నారని ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గం నుండి ప్రజలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని రావడం ఎంతో అనుకూలంగా మారుతుందని ఈ సందర్భంగా చెప్పారు. 11వ తేదీన కూడా మళ్లీ మరో సభకు మోడీ వస్తారని నరసింహారెడ్డి చెప్పారు. తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి ప్రకటన ఎంతో సానుకూలంగా ఉందని బీసీలందరూ కదిలి రావాలని అన్నారు.
-----------------------
Admin