సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ఎన్నో చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేక ఉద్యోగాల కోసం ఆశగా వెతుకుతూ ఉద్యోగాలు రాక చివరకు నిరాశ చెందుతున్న నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని షాద్ నగర్ పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం షాద్ నగర్ పట్టణంలోని ఈడెన్ ప్లాజాలో శ్రేయన్ కన్సల్టెన్సీ, పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో రెండవ జాబ్ మేళా కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. రెండు రోజులపాటు జరిగే ఈ జాబ్ మేళాలో దాదాపు 5వేల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఆయన భరోసా ఇచ్చారు. యువత చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం వారి నైపుణ్యతకు తగ్గ ప్రతిఫలం ఈ జాబ్ మేళాలో లభిస్తుందని అన్నారు. స్థానికులకు పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలపై ఒక అపోహ ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే వారి వల్ల కంపెనీలో సంఘాలు, ఇతర వ్యాపకాలు ఉంటాయనే అపోహ యాజమాన్యాలకు ఉందని అలాంటి అపోహలను ఎవరు నమ్మవద్దని అన్నారు. పారిశ్రామిక ప్రగతికి స్థానికులే ఎక్కువ కృషి చేస్తారని ఆయన చెప్పారు. ప్రతి యువతీ యువకుల్లో సమర్ధత ఆత్మవిశ్వాసం నైపుణ్యత ఉంటే చాలని అన్నారు. గతంలో మొదటిసారిగా జాబ్ మేళా నిర్వహిస్తే 632 మంది ఉద్యోగం పొందారని వారు ఎంతో విశ్వాసంతో తమ పనులు చేసుకుంటున్నారని అన్నారు. ఉద్యోగం కోసం వెంపర్లాడే యువతీ యువకులకు ఆత్మవిశ్వాసం ఎంతో గొప్పదని, భాషా నైపుణ్యం ప్రాముఖ్యత కల్పిస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. ఏ రాజకీయాలను ఆశించి తాను జాబ్ మేళా నిర్వహించడం లేదని తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు 24 సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. త్వరలోనే 25వ సేవా కార్యక్రమాన్ని ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఉద్యోగాల రూపకల్పనలో రాజకీయ నాయకులు ఎన్నో చెబుతుంటారని వాటిని విశ్వసించకూడదని అన్నారు. ఏ కులం ఏ మతం ఏ రాజకీయం పార్టీ తారతమ్య భేదాలు లేకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తన లక్ష్యమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఎవరైనా సరే తన వద్దకు ఉద్యోగం కోసం వస్తే తన శక్తి మేరకు వారి నైపుణ్యతను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని అన్నారు. మొదటిరోజు 3000 ఉద్యోగాలు, రెండవ రోజు 2000 ఉద్యోగాలు ఇలా మొత్తం 5000 ఉద్యోగాల వరకు అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు తమ నైపుణ్యంతో వాటిని తమకు అవసరమైన ఉద్యోగాలను పొందవచ్చు అని సూచించారు. యువతలో సమర్థత విశ్వసనీయత ఉన్నంతవరకు వారికి ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయని అన్నారు. యువత మద్యం రాజకీయాల వైపు వెళ్లకుండా సంపాదించే దశలో సేవ, ఉద్యోగం, ఉపాధి వైపు చూడాలని అన్నారు. నిరంతరం ఉద్యోగ అవకాశాల కోసం పాలమూరు చారిటబుల్ ట్రస్టు సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, ఆకుల ప్రదీప్, మోహన్ సింగ్, మాజీ వైస్ ఎంపీపీ పసుల నరసింహ, లష్కర్ నాయక్, శ్యాంసుందర్ రెడ్డి, శేఖర్ అప్ప తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin