సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : షాద్ నగర్ : దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా చెప్పుకునే సీఎం కేసీఆర్ కు వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని అందుకే గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి. హనుమంతరావు (వీహెచ్) అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో వచ్చే నెల జరుపబోయే కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ సభకు సంబంధించి స్థల పరిశీలన కోసం ఇక్కడికి వచ్చారు. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో స్థానిక వి కన్వెన్షన్ హాల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి, పిసిసి జాయింట్ సెక్రెటరీ పటేల్ రమేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మీడియా సమావేశంలో హనుమంతరావు మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడిస్తారని భయంతోనే గజ్వేల్ లో గెలిచే పరిస్థితి లేనందున తన పరువు కాపాడుకోవడానికి సీఎం కేసీఆర్ కామారెడ్డిలో కూడా పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజల్లో ఎంతో మార్పు వచ్చిందని అన్నారు. రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సభ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుందని అన్నారు. బీసీ క్రిమిలేయర్ విధానాన్ని ఎత్తివేయాలని వి.హనుమంత రావు పేర్కొన్నారు. ఓబీసీకి ప్రత్యేక మినిస్ట్రీ అవసరం ఉందని అన్నారు. 50 శాతం రిజర్వేషన్ సీలింగ్ తొలగించాలన్నారు. బీసీ వ్యక్తి ప్రధాన మంత్రిగా ఉండి బీసీలకు న్యాయం చేయలేకపోతున్నాడని మోదీని విమర్శించారు. అందుకే దేశంలో ఓబీసీ క్యాస్ట్ వైస్ జనగణన జరగాలన్నారు. పబ్లిక్ సెక్టార్ యూనిట్ లని ప్రైవేటు చేయడం మానేయాలన్నారు. అంతేగాక ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉన్నదన్నారు. జ్యూడిషియల్, ప్రైవేట్ సెక్టార్ రిజర్వేషన్లు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేలా చొరవ చూపాలన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీకి సాధ్యం అవుతుందని అన్నారు. బీసీల తడాఖా చూపించడానికి వచ్చేనెల షాద్ నగర్ పట్టణంలో బీసీ డిక్లరేషన్ సభను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కనీసం మూడు లక్షల మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు సమీకరణ చేసే విధంగా ఈ సభ ఉంటుందని అన్నారు. బీసీల ఐక్యత చూపకపోతే మరో ముప్పై ఏళ్లు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా బీసీల పరిస్థితి మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
-----------------------
Admin