సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: జనాభాలో 90 శాతం వరకు ఉన్న బహుజనులకు రాజ్యాధికారం కల్పించాలనే లక్ష్యంతో గత నెల రోజులుగా ఇంటింటికి బీఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగానే మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో కనీసం తాగునీరు గానీ,రహదారి సౌకర్యం గానీ సక్రమంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు.ఇటీవల కాలంలో కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ప్రజల మధ్య లేకుండా కేవలం లాబీయింగ్ ల ద్వారా ఎమ్మెల్యే టికెట్లను సంపాదించుకొని నోట్ల కట్టలతో ఓట్లను వేయించుకోవచ్చని భ్రమలో తిరుగుతున్నారని ఆక్షేపించారు.అవినీతి అక్రమాలకు పాల్పడి దొడ్డిదారిలో సంపాదించిన కోట్ల రూపాయలను ఎన్నికల్లో ఖర్చు చేసి ఎమ్మెల్యేలుగా గెలవవచ్చునని అనుకుంటున్నారని కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రం అది చెల్లదని స్పష్టం చేశారు.నియోజకవర్గంలో పదేళ్లుగా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాటం చేసే తనకు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.అధికార పార్టీలకు ఎక్కడ తలవంచకుండా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటున్న స్థానికుడైన తన పట్ల ప్రజలకు కూడా అపార అభిమానం ఉందని అది ఓట్ల రూపంలో ఖచ్చితంగా నిరూపితం అవుతుందని జోస్యం చెప్పారు.ఎన్నికలకు ఆరు నెలల ముందు ఇక్కడకు వచ్చి వలసవాదులుగా చెప్పుకునే నాయకులు ఇక్కడ ఓట్లు అడగడం ఇకమీదట చెల్లదని స్పష్టం చేశారు.ఓటుకు 500,1000 ఇచ్చే వారిని నమ్మవద్దని గెలిచినాక మొఖం చాటేసుకొని వెళ్లిపోతారని చెప్పారు.కొత్తగూడెం నియోజకవర్గంలోని ప్రతి చోట అనూహ్య స్వాగతం లభిస్తుందని తెలిపారు ప్రజల నుంచి వచ్చే స్పందనను చూస్తుంటే రానున్న ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో బీఎస్పి పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,సాయి,అసెంబ్లీ అధ్యక్షుడు నాగుల రవికుమార్,పూజల ప్రసాద్,ఆవాల ప్రవీణ్ కుమార్,బింగు రాము తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin