సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కించుకున్నానని... రాబోయే ఎన్నికల్లో తనను చంపుకుంటారో , లేక బతికించుకుంటారో అన్నది మక్తల్ నియోజకవర్గం ప్రజల నిర్ణయం పై ఆధారపడి ఉంటుందని కాంగ్రెస్ అభ్యర్థి వాకిటి శ్రీహరి అన్నారు. తన తుదిశ్వాస ఉన్నంతవరకు తాను పుట్టిన గడ్డ మక్తల్ నియోజకవర్గం సేవ చేసుకుంటూ రుణం తీర్చుకుంటానని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మక్తల్ నుంచి ఒకటి శ్రీహరి పేరును ఖరారు చేసిన తర్వాత తొలిసారిగా మక్తల్ కు వచ్చిన వాకిటి శ్రీహరికి కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, స్థానిక ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వేలాది సంఖ్యలో అభిమానులు వాకిటి శ్రీహరి నివాసానికి తరలివచ్చి శాలువా పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలపడంతో పాటు రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి శాసనసభలో మక్తల్ ఎమ్మెల్యేగా అడుగు పెట్టాలని ఆకాంక్షించారు. ఆ తర్వాత నివాసం నుంచి పడమటి ఆంజనేయస్వామి ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి తమ ఇంటి దేవుడు అయినా పడమటి ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళిలు అర్పించారు. ఆ తర్వాత ఇంటి వద్ద ఏర్పాటుచేసిన ముఖ్యనాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మక్తల్, మాగనూరు, నర్వ, కృష్ణ, ఊట్కూర్ మండలాలతో పాటు మక్తల్ టౌన్ నుంచి మాజీ కౌన్సిలర్లు మాజీ ప్రజా ప్రతినిధులు ఇతర పార్టీలకు చెందిన సుమారు 800 మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం వాకిటి శ్రీహరి మాట్లాడుతూ... మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి మక్తల్ నియోజకవర్గం ను ఏమాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. సంఘంబండ ప్రాజెక్టులో మిగిలిపోయిన బండరాయిని తొలగిస్తే సుమారు 16 గ్రామాలకు 25 వేల ఎకరాలకు పైగా సాగునీరు ఇచ్చే అవకాశం ఉందని.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఎందుకు బండరాయి తొలగించలేకపోయారని ప్రశ్నించారు. నాలుగోసారి అవకాశం ఇస్తే బండరాయి తొలగిస్తానని హామీ ఇస్తున్నారని... మూడుసార్లు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. మక్తల్ నియోజకవర్గంకు హామీ ఇచ్చిన వంద పడకల ఆసుపత్రి ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇప్పటికీ డిగ్రీ కాలేజీకి భవనం లేదని, క్రీడాకారులు ఆడుకునేందుకు సరైన గ్రౌండ్ సైతం లేదని వాపోయారు. మక్తల్ నియోజవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని, ఏడు మండలాల్లో కనీసం ఒక్క డబుల్ బెడ్ రూమ్ అయినా నిర్మించారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి ఎకరానికి 15000 రైతుబంధు ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరోగ్యారెంటీలు చూసి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ కు ఓటేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాకు బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఎంపిటిసిలు సర్పంచులు వార్డు కౌన్సిలర్లు, గ్రామాల పెద్దలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------------
Admin