సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : సాధారణంగా పండుగల సమయంలో బస్సులు, రైళ్లు చాలా రద్దీగా ఉంటాయి. ఇలాంటి సమయంలో టికెట్ దొరకడమంటే చాలా గొప్ప విషయమని చెప్పాలి. ఇక టికెట్లు లేక తప్పనిసరి పరిస్థితుల్లో జనరల్ బోగీల్లో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు వారి అవస్థలు గురించి చెప్పాల్సిన పనిలేదు. కిక్కిరిసిన జనంతో రైలు ఎక్కడమే కష్టమనుకుంటే మరోవైపు సీటుకోసం పోటీపడేవారి సంగతి చెప్పనక్కర్లేదు. కిటికీలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లూ ఏవీ వదలరు. ఏ చిన్న అవకాశం దొరికినా రైల్లోకి ఎక్కే ప్రయత్నం చేస్తారు. సరిగ్గా అలాంటి సంఘటనే హైదరాబాదు రైల్వేస్టేషన్లో చోటుచేసుకుంది. కిక్కిరిసిన జనంతో హైదరాబాదు రైల్వే స్టేషన్ జనసంద్రాన్ని తలపించింది. రైల్లోనే కాదు, ప్లాట్ఫాం పైన కూడా అడుగుపెట్టేందుకు సందులేనంతగా జనాలు చేరుకున్నారు. ఇక రైలు ఎక్కేందుకు ప్రయాణికులు తీవ్రంగా పోటీపడ్డారు. ఈ క్రమంలో ఓ యువతి ఎమర్జెన్సీ విండో ఓపెన్ చేసి అందులోంచి రైల్లోకి ప్రవేశించింది. మరో మహిళ కూడా ఆమెను అనుసరించింది. చీరకట్టులో ఉన్న ఆ మహిళ అలా రైలు ఎక్కడం పెద్ద సాహసమే అనుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ వినియోగదారు ఈ వీడియోను ఎక్స్ ఖాతీలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు. అతి చిన్న డోర్నుంచి చీర కట్టుకుని కంపార్ట్మెంట్లోకి ఎక్కడం గొప్ప ఫీట్ అని ఒకరు, విండోస్ ట్రైనింగ్ అని ఇంకొకరు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ని ఎమర్జెన్సీ ఎంట్రన్స్గా మార్చారు అంటూ మరొకరు రకరకాలుగా కామెంట్లతో హోరెత్తించారు.... సంక్రాంతి పండగ సమీపిస్తుండటంతో వేలాది మంది యాత్రికులు ఇలా రైల్వేస్టేషన్కు పోటెత్తారు....
-----------------------
Admin