సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : అనకాపల్లికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగికి గతంలో వివాహమైంది. అయితే అనంతరం వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మరో పెళ్లి కోసం సంబంధాలు వెతకడం ప్రారంభించాడు. ఇదే సమయంలో ఆన్లైన్లో పెళ్లి సంబంధం కోసం సెర్చ్ చేస్తుండగా హైదరాబాద్కు చెందిన ఓ యువతితో పరిచయమైంది. తనను ఒక న్యాయవాదిగా పరిచయం చేసుకున్న ఆ యువతి కొన్ని రోజులు బాగా మాట్లాడి ఆ తర్వాత అసలు రూపాన్ని బయటపెట్టింది.తనను పెళ్లి చేసుకోవాలంటే కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండాలని కండిషన్ పెట్టింది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలు ఉన్నాయని, తనకున్న పరిచాయలతో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది. ఇందుకు కొంత ఖర్చు అవుతుందంటూ.. అతని నుంచి గతేడాది అక్టోబర్లో ఒకసారి రూ. 5 లక్షలు, నవంబర్లో మరో రూ. 5 లక్షలు బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు పంపించుకుంది. ఎంతకీ ఉద్యోగం రాకపోవడం, పెళ్లి విషయాన్ని దాటేస్తుండడంతో మోసపోయానని తెలుసుకున్న సదరు పోలీసులను ఆశ్రయించాడు. డబ్బులు అడుగుతుంటే ప్రియుడితో కలసి చంపేస్తానని బెదిరిస్తోందని బాధితుడు అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో కేసు స్వీకరించిన పోలీసులు విచారణ ప్రారంభించారు.
-----------------------
Admin