సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నాగార్జునసాగర్ ప్రాజెక్టు లో 520 అడుగుల నీళ్లు ఉండి కూడా ఆయకట్టు పరిధిలో వేసిన పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వం చూసీ చూడనట్లుగా ఉండటం కరెక్ట్ కాదని వెంటనే నీటిని విడిచి ఎండుతున్న పంటలను కాపాడాలని సిపిఐ మండల కార్యదర్శి పోకల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గరిడేపల్లి మండల కేంద్రంలో జరిగిన సిపిఐ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నీళ్లు ఇస్తుందనే ఆశతో ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఖర్చు చేసి పంటలు వేసుకున్నారని ఇప్పటి వరకు బావులు, బోర్ల తో పంటలు తడుపుకున్నారాని, రాను, రాను బూగర్భ జలాలు అడగంటం తో, బావులు ఎండిపోయినాయని, బోర్లు మొత్తం తగ్గి వేసిన పంటలు ఎండిపోవుచున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న గాక మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కూడా సాగర్ నుండి ఐదు టి ఎం సి ల నీటిని పది రోజులు తీసుకున్నారని, అయినా తెలంగాణా పెద్దలు మనకు కూడా నీళ్లు కావాలని కోరక పోవడం అన్యాయం అని ఆయన అన్నారు.సాగర్ ఆయకట్టు పరిధిలో చెర్వులు, కుంటలు, బావులు మొత్తం ఎండిపోయినాయని, వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, పంటలు ఎండితే పశువులకు కూడా మేత కరువు అవుతుందని ఆయన అన్నారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు త్రిపురం సుధాకర్ రెడ్డి, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు యడ్ల అంజిరెడ్డి, ఏ ఐ వై ఎఫ్ నాయకులు మెండే లింగరాజు, చామకూరి కాశయ్య, శొంఠి వెంకన్న, యాసరపు పున్నయ్య,ప్రధాని సైదులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin