సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఫారూఖ్ నగర్ మండల్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలను అవలంబించేందుకు కుట్ర చేస్తుందని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వ్యతిరేకిస్తూ గుడ్ల మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తుందంటూ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి 24 గంటల కరెంటు వద్దంటూ మూడు గంటల కరెంటు చాలని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఫారూఖ్ నగర్ మండలం కొండన్నగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలపై తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణ వద్దని ఈ ప్రాంతాన్ని పాలించే తెలివి కేసిఆర్ కు లేదని ఆనాడు ప్రజల ముందు ఎన్నో మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నేడు తెలంగాణ బాగుపడి కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంటే రాజకీయంగా ఓర్వలేక లేనిపోని విమర్శలు చేస్తున్నారని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కడుపు కొట్టాలని చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయ్యాక గ్రామాల్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో కళ్లారా చూడాలని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలతో తాగునీరు, సాగునీటికి ఎంతో పెద్దపీట వేసి వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేశారని కొనియాడారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను అనుభవిస్తూ మళ్లీ ప్రభుత్వం పైనే దుమ్మెత్తి పోయడం కాంగ్రెస్ పార్టీ నైజం అని విమర్శించారు. ప్రభుత్వం ఎంతో దూర దృష్టితో అనేక వర్గాలను ఆదుకునేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టారని వాటిని తీసుకుంటూనే అది ఎవరు పెట్టమన్నారు? అంటూ ప్రభుత్వంపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక ప్రతి గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తోందని అన్నారు. 24 గంటల కరెంటు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రైతులు తీర్మానాలు చేస్తున్నారని వీటితో కాంగ్రెస్ పార్టీకి కనువిప్పు కావాలని అన్నారు.
-----------------------
Admin